తెలంగాణపై వైయస్ పెదవి విరుపు
న్యూఢిల్లీ: చిన్న రాష్ట్రాలకు నక్సల్స్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. జార్ఖండ్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో నక్సల్స్ సమస్య పెరిగిందని, అవి చిన్న రాష్ట్రాలు కావడం వల్లనే ఆ సమస్య పెరిగిందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్లమెంటు సభ్యుడు ఎన్. జనార్దన్ రెడ్డి నివాసంలో పద్మా అవార్డు విజేతలకు ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులు కూడా ఈ విందుకు హాజరయ్యారు. ప్రధాని దంపతులు వెళ్లిపోయిన కొద్దిసేపటికి ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు.
ముఖ్యమంత్రి పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర డిమాండ్పై పెదవి విరిచారు. తెలంగాణపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన నవ్వుతూ సమాధానాలు దాటవేశారు. తమ పార్టీ రెండో రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ కమిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నదని ఆయన అన్నారు. ఛత్తీస్ఘడ్, జార్ఖండ్లు విడిపోవడం వల్ల అభివృద్ధి మాట అలా వుంచి నక్సలిజం పెరిగిందని, శాంతి భద్రతల సమస్య తీవ్రమైందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇప్పటికే కేంద్రానికి నివేదించారని ఆయన చెప్పారు. అసెంబ్లీలు చిన్నవి కావడం వల్ల నిర్ణయాత్మక మెజారిటీలు లేక ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని ఆయన అన్నారు. మీరు దానితో ఏకీభవిస్తున్నారా అని అడిగితే ములాయం చెప్పినదాన్ని తాను చెబుతున్నానని ఆయన జవాబిచ్చారు. నేరుగా ఆయన సమాధానం ఇవ్వలేదు. ములాయం చెప్పిన మాటలు ఒక ఏకాభిప్రాయంలా అనిపించాయని, అందరికీ నచ్చాయని ఆయన నవ్వుతూ అన్నారు.
ముఖ్యమంత్రి మంగళవారం ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ నేతృత్వంలో ఏర్పాటయిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.