అసెంబ్లీలో ప్రభుత్వ తీరు దారుణం: బాబు
హైదరాబాద్: శాసనసభలో ప్రజా సమస్యలను సరిగా చర్చకు చేపట్టలేకపోయామని ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలను దాటవేసే వైఖరిని అవలంబించిందని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని, ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేదని ఆయన అన్నారు.
మొత్తంగా చూస్తే శాసనసభా సమయం చాలా తగ్గిందని, బయటి పనులకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని కాంగ్రెస్ అసెంబ్లీలో చర్చలకు ఇవ్వలేదని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తమకు తక్కువ సమయం ఇచ్చారని, 304 నిబంధన కింద తమది ఒకటే అంశం చర్చకు వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీలో దారుణంగా ప్రవర్తించిందని ఆయన అన్నారు. ప్రతిపక్షం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి అధికార పక్షం మెప్పించాలని, అలా కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంపైననే ఎదురుదాడికి దిగిందని ఆయన అన్నారు. ఏ విషయంలోనూ ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని సిపి ఐ పక్ష నాయకుడు చాడా వెంకటరెడ్డి విడిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.