విప్లవ పార్టీలపై నిషేధంతో దేశంలో ఎమర్జెన్సీ: కళ్యాణ్
హైదరాబాద్: విప్లవపార్టీలపై నిషేధం విధించడం ద్వారా దేశంలో మరోసారి ఎమర్జెన్సీ పరిస్థితిని కల్పించడమేనని మావోయిస్టుల ప్రతినిధి, ప్రముఖ రచయిత జి. కళ్యాణ్ రావు అన్నారు. నక్సలైట్లపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందనే వార్తలపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా స్పందించారు. ఉద్యమాలను నీరుగార్చడానికే విప్లవ పార్టీలపై నిషేధం విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని ఆయన అన్నారు.
విప్లవపార్టీలపై నిషేధం విధించడమంటే ప్రజలపై నిషేధం విధించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. విప్లవపార్టీలపై నిషేధం వల్ల పరోక్షంగా రాజకీయ పార్టీలన్నీ అణచివేతకు గురవుతాయని ఆయన అన్నారు. విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచి, తమ ఇష్టమొచ్చిన పాలనను ప్రజలపై రుద్దడానికే విప్లవ పార్టీలపై నిషేదం విధించాలని ఆలోచిస్తోందని ఆయన అన్నారు. ఈ విషయమై మేధాలువు, ఆలోచనాపరులు ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.