ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి సూరి
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరిని ఐదు రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు తన నిర్ణయాన్ని బుధవారం సాయంత్రం వెల్లడించింది. సూరిని ఐదు రోజుల పాటు విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టును కోరింది. సిబిఐ పిటిషన్పై మంగళవారం వాదనలు ముగిశాయి. కోర్టు తన నిర్ణయాన్ని బుధవారం వెల్లడించింది.
ఇదిలావుంటే, పరిటాల రవి హత్య కేసులో నిందితుడు నారాయణ రెడ్డికి బుధవారం ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రవిని హత్య చేసిన సందర్భంగా బుల్లెట్ దూసుకెళ్లడం వల్ల జరిగిన గాయానికి చికిత్స నిమిత్తం నారాయణ రెడ్డిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. రవి హత్యతో సూరికి ఏ విధమైన సంబంధం లేదని నారాయణ రెడ్డి ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ప్రతినిధితో ఈ సమయంలో అన్నాడు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు రవిని తామే హత్య చేశామని ఆయన చెప్పుకున్నాడు.