సాగునీటి టెండర్లపై ప్రభుత్వం తీరు నష్టం: బిజెపి
విజయవాడ/ హైదరాబాద్: సాగునీటి టెండర్ల ఖరారు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన బుధవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రారంభ దశలోనే సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన అన్నారు. మొత్తం 31 ప్రాజెక్టులను 45 వేల కోట్ల రూపాయలతో చేపడతామని ప్రభుత్వం అంటోందని, టెండర్ల ఖరారులో అవినీతికి అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు.
సాగునీటి టెండర్ల ఖరారుపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని కాంగ్రెస్ శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాద్లో విలేకరులతో అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు విషయంలో 10 శాతం అధికంగా కోట్ చేసిన టెండర్ను ఖరారు చేసిందని ఆయన చెప్పారు.