ప్రముఖ రచయిత విజయన్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ రచయిత, కార్టూనిస్టు ఒ.వి. విజయన్ బుధవారం హైదరాబాద్లో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఒక కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం మరణించారు. విజయన్ ఈ ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు చెప్పినట్లు డాక్టర్ ప్రభు దాస్ చెప్పారు. ఆయన వయస్సు 75 యేళ్లు.
విజయన్ నిరుడు ఆగస్టులో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. విజయన్ తొలుత మలయాళంలో సృజనాత్మక రచనలు చేశారు. ఆంగ్లంలో కూడా ఆయన రచనలు చేశారు. కార్టూనిస్టుగానే కాకుండా నవలారచయితగా, కథా రచయితగా, కాలమిస్టుగా ఆయన ప్రసిద్ధుడు. ఆయన ఐదు నవలలు రాశారు. ఎన్నో కథలు, వ్యాసాలు రాశారు.
ఒ.వి. విజయన్గా పేరుగాంచిన ఊట్టుపులక్కల్ వేలుకుట్టి విజయన్ 1930 జులై 2వ తేదీన కేరళలోని విలయంచంతన్నూర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి బ్రిటిష్ ఇండియాలోని గత మద్రాసు ప్రొవిన్స్లో మలబార్ స్పెషల్ పోలీసు ఆఫీసర్గా పనిచేశారు. జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించిన విజయన్ 1958లో కేరళను వదిలిపెట్టి ఢిల్లీలోని శంకర్ వీక్లీలో చేరారు. ఎమర్జెన్సీ కాలంలో వేసిన రాజకీయ కార్టూన్లు ఎంతో ఆదరణ పొందాయి. ఆ తర్వాత పెట్రాయిట్లో స్టాఫ్ కార్టూనిస్టుగా చేరారు. ఆయన ఢిల్లీలోని ఫిలాసఫీ టీచర్ థెరిస్సా గాబ్రియెల్ను వివాహమాడారు.
విజయన్ అంత్యక్రియలు కేరళలోని పాలక్కాడ్లో జరుగుతాయి. మొదట ఆయన భౌతిక కాయాన్ని సికింద్రాబాద్లోని నివాసానికి తరలించి ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్లో కేరళకు తీసుకెళ్తారు. విజయన్ కుటుంబ సభ్యులతో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మాట్లాడి భౌతిక కాయాన్ని కేరళకు తీసుకు రావాల్సిందిగా కోరారు.