హామీలపై ప్రజలకు ఆశలు వద్దు: జెసి
విజయవాడ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలపై ప్రజలు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని రాష్ట్ర మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు. ప్రజాపథం కార్యక్రమం సందర్భంగా ఆయన సోమవారంనాడు కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని ఒక గ్రామంలో విలేకరులతో ఆ సత్యవాక్కు పలికారు. ఓట్ల కోసమే ఎవరైనా వాగ్దానాలు చేస్తారని, అడిగినవన్నీ చేస్తామని హామీలు ఇస్తారని ఆయన అన్నారు. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా ప్రజలకు హామీలు ఇస్తారని, అందుకు కాంగ్రెస్ మినహాయింపు కాదని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలు ఏవీ అడగవద్దని, ఎన్నికల సమయంలో అడిగితే సాధ్యాసాధ్యాలు పట్టించుకోకుండా అవసరం ఉంది కాబట్టి అన్నీ చేస్తామని చెబుతారని ఆయన అన్నారు. ఏవైనా అడగదలుచుకుంటే ప్రజలు ఎన్నికలు లేని సమయంలో అడగాలని, అప్పుడైతే సాధ్యాసాధ్యాలు ఆలోచించి హామీలు ఇస్తారని ఆయన అన్నారు. వాగ్దానాలు చేయడం తనకు అలవాటు లేదని ఆయన చెప్పారు.