సిపియం నేత కరత్: పొలిట్బ్యూరోలో రాఘవులు
న్యూఢిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు (సిపియం) పగ్గాలు ప్రకాశ్ కరత్ చేతికి దక్కాయి. హరికిషన్ సింగ్ సూర్జిత్ స్థానంలో సిపియం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రకాశ్ కరత్ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సిపియం ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులుకు పోలిట్ బ్యూరోలో చోటు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన పార్టీ కాంగ్రెస్ చివరి రోజు సోమవారం పార్టీ ఎన్నికలు జరిగాయి.
వయసు మీద పడడంతో పదవి నుంచి తప్పుకుంటానని 89 యేళ్ల సుర్జీత్ చెప్పడంతో కొత్త నేత ఎంపిక అనివార్యంగా మారింది. పోలిట్బ్యూరోలో తొలిసారి ఒక మహిళకు స్థానం దక్కింది. ప్రకాశ్ కారత్ భార్య బృందా కరత్ పోలిట్బ్యూరోలోకి వచ్చారు. రాఘవులు, బృందాకరత్లతో పాటు మరో ఇద్దరు కొత్తవారికి పోలిట్ బ్యూరో స్థానం లభించింది. చిత్రవ్రత మజుందార్, కె. వరదరాజన్లు పోలిట్బ్యూరోలోకి కొత్తగా వచ్చినవారు.
పోలిట్బ్యూరో నుంచి తప్పుకుంటానని 91 యేళ్ల పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు చెప్పారు. అయితే ఆయన పోలిట్బ్యూరోలో కొనసాగుతారు. హరికిషన్ సింగ్ సూర్జీత్ కూడా పోలిట్బ్యూరో సభ్యుడిగా ఉంటారు.
పోలిట్బ్యూరో సభ్యులు: హరికిషన్ సింగ్ సుర్జీత్, జ్యోతిబసు, ప్రకాశ్ కరత్, వి.యస్. అచుతానందన్, ఎస్ రామచంద్రన్ పిళ్లే, సితారాం ఏచూరి, ఆర్. ఉమనాథ్, యం.కె. పాండే, బిమన్ బసు, అనిల్ బిస్వాస్, త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సర్కార్, పినరై విజయన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య. వీరితో పాటు నలుగురు కొత్తగా ఎన్నికయ్యారు.