కట్టలు తెగిన మిర్చి రైతుల ఆగ్రహం
గుంటూరు/వరంగల్: మిర్చి రైతుల ఆగ్రహం గుంటూరులో కట్టల తెంచుకుంది. నిబంధనల పేరుతో మిర్చి కొనుగోలుకు మార్క్ఫెడ్ అధికారులు నిరాకరించడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మార్క్ఫెడ్ అధికారులను షట్లర్లు మూసి అధికారులను నిర్బంధించారు. ఆ తర్వాత రాస్తారోకో నిర్వహించారు. తాము నిబంధనల మేరకే మిర్చిని కొనుగోలు చేస్తున్నామని మార్క్ఫెడ్ అధికారులు అంటున్నారు. నిబంధనల పేరుతో మేలైన రకాన్ని కూడా కొనడానికి మార్క్ఫెడ్ అధికారులు నిరాకరిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
ఇదిలా వుంటే, వరంగల్లోని మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. తెలుగుదేశం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో రైతులు ధర్నా చేశారు. అన్ని రకాల మిర్చిని మార్క్ఫెడ్ కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. రైతులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో దయాకర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసుల ప్రయత్నాలను అడ్డుకున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని దయాకర్ రావు విమర్శించారు.