వైయస్తో గద్దర్ భేటీ : మరో శాంతి యత్నం
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ మంగళవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో కూంబింగ్, ఎన్కౌంటర్లు ఆపాలని, ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని గద్దర్ ముఖ్యమంత్రితో అన్నారు. మూడు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని గద్దర్ ముఖ్యమంత్రికి ఇచ్చారు. సిపి ఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ పేరు మీద విడుదలైన నకిలీ ప్రకటనపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. కవులు, రచయితలు, కళాకారులు తలపెట్టిన శాంతియాత్రకు అనుమతి ఇవ్వాలని, రక్షణ కల్పించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తులకు ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు.
నక్సలైట్లతో తదుపరి చర్చలు ఆయుధాలపైననే జరగాలని ముఖ్యమంత్రి అన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ విషయాన్ని మొదటి దశ చర్చలకు ముందే చెప్పి ఉండాల్సిందని తాను అన్నట్లు గద్దర్ చెప్పారు. తన ఆలోచనలను రికార్డు చేసిన క్యాసెట్ను ఇస్తానని, దాన్ని నక్సలైట్ నేతలకు పంపాలని రాజశేఖర్ రెడ్డి తనకు చెప్పారని ఆయన అన్నారు. వేంపెంటలో అంత మందిని ఊచకోత కోస్తే కూడా తాము గాలింపులు జరపవద్దా అని ముఖ్యమంత్రి అడిగారని, అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎన్కౌంటర్లు ఆగిపోతే అటు వైపు నుంచి హింస ఆగిపోతుందని తాను చెప్పినట్లు గద్దర్ చెప్పారు. తాము పోస్ట్మెన్ ఉద్యోగం చేస్తూనే ఉన్నామని, తాము చేస్తామని ఆయన అన్నారు.