కల్తీ కల్లుకు 16 మంది బలి, 5గురు ఆంధ్రులు
బెంగుళూర్: కర్ణాటకలో కల్తీ కల్లు సేవించి 16 మంది మరణించారు. ఇందులో ఐదుగురు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. బెంగుళూర్ సమీపంలో కూలీలు కల్లు సేవించారు. అయితే అధికంగా సేవించినవారు మృత్యువాత పడ్డారు. ఈ కల్లు సేవించి అస్వస్థులైన మరో 20 మంది అస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు సేవించినవారు బెంగుళూర్ రూరల్ జిల్లాలోని నేలమంగల తాలుకాలోని మూడు గ్రామాలకు చెందినవారు. మరణించినవారిలో ఐదుగురు మహిళలున్నారు.
ఈ సంఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనలో విచారణ నిమిత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు సూపరింటిండెంట్ ప్రశాంత్ కుమార్ ఠాకూర్ చెప్పారు. నకిలీ ప్యాకెట్లలోని మద్యాన్ని వారు సేవించారని ఆయన చెప్పారు. గత రాత్రి కూలీలు కల్తీ కల్లు సేవించారు. కొంత మంది సోమవారం రాత్రి మరణించగా, మరికొంత మంది మంగళవారంనాడు మరణించారు. మద్యం నమూనాలను ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపినట్లు ఠాకూర్ చెప్పారు.