కరీంనగర్ జిల్లాలో యువకుడి లాకప్ డెత్?
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో లాక్ డెత్ జరిగింది. పోలీసుల చిత్రహింసలకు ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడనే అరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కాటారం పోలీసు స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సంపత్ అనే యువకుడిని కాటారం పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తెల్లారి చూసేసరికి అతను శవమై కనిపించాడు. అనారోగ్యంతో మరణించడాని పోలీసుల చెబుతుండగా పోలీసుల చిత్రహింసలకే మరణించాడని సంపత్ తల్లి, సోదరుడు అంటున్నారు. సంపత్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, విద్యుత్ షాక్ కూడా పెట్టారని వారంటున్నారు.
తాము సోమవారం రాత్రి సంపత్ను అదుపులోకి తీసుకున్నామని, నక్సలైట్లతో సంబంధాలున్నాయనే అనుమానంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నామని, అతని నుంచి రెండు మందుపాతరలు కూడా స్వాధీనం చేసుకున్నామని కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి చెప్పారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో సంపత్ కడుపు నొప్పితో బాధపడుతుండటంతో గోదావరిఖని ఆస్పత్రికి తరలించామని, అయితే అతను మరణించాడని ఆయన చెబుతున్నారు. మంథని, కాటారం, మహదేవ్పూర్లలో వైద్యులు లేకపోవడంతో గోదావరిఖనికి తీసికెళ్లి ప్రభుత్వాస్పత్రిలో చేర్చామని ఆయన అన్నారు.