ఇంకా ఏమీ అనుకోలేదు: గంగూలీ
కోల్కత్తా: తనపై విధించిన నిషేధంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి విజ్ఞప్తి చేసుకునే విషయంలో ఇంకా తాను ఏ నిర్ణయమూ తీసుకోలేదని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీ చెప్పారు. అహ్మదాబాద్లో పాక్తో జరిగిన నాలుగో వన్డేలో మందకొడి బౌలింగ్ చేసినందుకు గాను ఐసిసి గంగూలీపై ఆరు మ్యాచ్ల నిషేధం విధించింది.
"చూద్దాం. ఇప్పుడే వచ్చాను కదా! మొదట నేను జగ్మోహన్ దాల్మియాతో మాట్లాడాల్సి ఉంది. ఆ తర్వాతనే నిర్ణయం తీసుకుంటాను అని గంగూలీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. తర్వాతి రెండు మ్యాచ్లకు తన స్థానంలో రాహుల్ ద్రావిడ్ను కెప్టెన్గా ఎంపిక చేసిన నేపథ్యంలో గంగూలీ ఇక్కడికి వచ్చారు. ఈ విషయంపై తాను ఇంకా బిసిసి ఐ అధికారులు ఎవరితోనూ మాట్లాడలేదని గంగూలీ అన్నారు. ఐసిసి నుంచి అధికారిక సమాచారం అందిన వెంటనే అప్పీల్ చేసే అవకాశం ఉన్నట్లు బిసిసిఐ అధ్యక్షుడు రణబీర్ సింగ్ మహేంద్ర సూచనప్రాయంగా చెప్పారు.