ప్రణబ్తో కెసిఆర్ భేటీ: ఎల్లుండి సబ్ కమిటీ మీట్
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణపై ఏర్పాటయిన ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ఉప సంఘం చైర్మన్ ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) అధినేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారంనాడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కీలక ప్రాధాన్యం ఉన్నట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్తో కలిసి కెసి ఆర్ ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. తమ సబ్ కమిటీ తొలి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని ప్రణబ్ ముఖర్జీ కెసి ఆర్కు చెప్పారు. సబ్ కమిటీ ఏర్పడిన చాలా రోజులే గడిచినప్పటికీ ఇప్పటి వరకు సమావేశం కాలేదు.
తమ పార్టీ ఆవిర్భావ దినం ఏప్రిల్ 27వ తేదీ లోగా తెలంగాణ రాష్ట్రం నిషయంలో కీలకమైన పరిణామం చోటు చేసుకోగలదని టిఆర్యస్ నాయకులు భావిస్తున్నారు. ఈలోగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ మధ్యంతర నివేదికను సమర్పించగలదనేది వారి ఆశాభావం. చంద్రశేఖర్ రావు మంగళవారంనాడు ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ రోజు సోనియా సలహాదారు అహ్మద్ పటేల్లతో కలిసి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించాలని రాష్ట్ర మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి అనడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా పరిగణిస్తోంది. తెలంగాణపై వ్యాఖ్యలు చేయవద్దనే కాంగ్రెస్ అధిష్ఠానవర్గం సూచనను జెసి ఉల్లంఘించడంపై టి ఆర్యస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని అధిష్ఠానవర్గానికి తెలియజేస్తానని కేశవరావు చెప్పినట్లు టి ఆర్యస్ నాయకులు చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం రాజధానిగానే ఉంటుందని టి ఆర్యస్ నాయకులన్నారు.