3 నెలల్లో పులిచింతల పనులు మొదలు: వైయస్
గుంటూరు/ ఒంగోలు: కృష్ణానదిపై తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టు పనులను మూడు నెలల్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లాలోని కొల్లిపరలో ప్రజాపథకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు రోజుకు ఏడు గంటలు విద్యుత్ అందిస్తామని ఆయన చెప్పారు. లక్ష వేల కోట్లు ఖర్చు అయినా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఇపిసి ద్వారా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, పులిచింతల ప్రాజెక్టు విషయంలో అనుమానాలు వద్దని ఆయన అన్నారు.
మార్క్ఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయించలేమని, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం చేస్తామని ఆయన కొల్లిపర ప్రజాపథం కార్యక్రమంలో అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిరుడు తెలుగుదేశం ప్రభుత్వం మిర్చికి అధిక ధరను నిర్ణయించిందని ఆయన అన్నారు. బెల్టు షాపులను రద్దు చేస్తామని ఆయన చెప్పారు.
అంతకు ముందు ఆయన ప్రకాశం జిల్లా మల్లవరంలో ప్రజాపథం కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని గుంటూరు జిల్లాకు బయలుదేరే ముందు హెలిపాడు వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు వ్యయాలు ఎందుకు పెరిగాయనే అంశంపై విశ్లేషించడానికి వారానికి ఒక రోజు ఒక్కో ప్రాజెక్టుపై బహిరంగ చర్చను చేపట్టామని ఆయన తెలిపారు. పొగాకు, మిర్చి పంటలకు గిట్టుబాట ధర లభించకపోవడంపై, పొగాకు, మిర్చి రైతుల సమస్యలపై విలేకరులు వేసిన ప్రశ్నలకు ఆయన నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వలేదు. పొగాకు, మిర్చిలకు గిట్టుబాటు ధర లేనందున ఆ రైతులకు మేలు చేసే పనులను చేపడతామని ఆయన చెప్పారు.