రైతుల సమస్యలపై వైయస్ ఫెయిల్: వెంకయ్య
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలను నిలువరించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు విమర్శించారు. రైతు సమస్యలను అధ్యయనం చేయడానికి బిజెపి ఏర్పాటు చేసిన వెంకయ్యనాయుడు నేతృత్వంలోని కమిటీ బుధవారం హైదరాబాద్కు వచ్చింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు కొద్ది సేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో విఫలమైందని ఆయన అన్నారు. హామీలు ఇచ్చి కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందు అన్నారని, కానీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2600 నుంచి 2800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడితో పాటు యశ్వంత్ సిన్హా, అన్నా సాయి పటేల్, తదితరులు వివిధ వర్గాలతో సమావేశమై రైతుల పరిస్థితిని అధ్యయనం చేస్తారు.