నీటిపారుదల అధికారులపై వైయస్ అసంతృప్తి
ఒంగోలు: నీటి పారుదల అధికారులపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగుతుండటంపై ఆయన నీటిపారుదల శాఖ అధికారులను నిలదీశారు. ఇదే విధంగా వెళ్తే తాము తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలు లక్ష కోట్ల రూపాయలకు పెరుగుతాయని ఆయన అన్నారు. బుధవారంనాడు ఆయన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మల్లవరం చేరుకున్నారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు అంచనా వ్యయం 165 కోట్ల రూపాయల నుంచి 450 కోట్లకు పెరగడంపై ఆయన అధికారులను ప్రశ్నించారు. ఇలాగే అయితే తాము 46 వేల కోట్లతో తలపెట్టిన 26 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం లక్ష కోట్ల రూపాయలు దాటుతుందని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రజాపథం కార్యక్రమం ముగించుకున్న ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాకు బయలుదేరి వెళ్లారు.