భారత్ ఘోర పరాజయం: సిరీస్ పాక్ వశం
న్యూఢిల్లీ: భారత్పై పాకిస్థాన్ ఢిల్లీలో ఆదివారం జరిగిన ఆరో వన్డేలో ఘనవిజయం సాధించింది. దీంతో ఆరు వన్డేల క్రికెట్ సిరీస్ను పాకిస్థాన్ 4-2 స్కోర్తో కైవసం చేసుకుంది. అన్ని విషయాల్లో ఆరో వన్డేలో పాకిస్థాన్దే పైచేయి అయింది. ఈ మ్యాచ్ను పాక్ 159 పరుగుల భారీ ఆధిక్యతతో గెలుచుకుంది. భారత్ ఓటమి ఖాయమైన భావించిన తరుణంలో రెచ్చిపోయిన ప్రేక్షకులు కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగించారు. పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్, భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ల సమక్షంలో మ్యాచ్ ప్రారంభమైంది.
పాకిస్థాన్ నిర్ణీత 50 ఓబర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్కు దిగిన భారత్ బ్యాట్స్మన్ ఏ ఒక్కరు కూడా నిలదొక్కుకోలేకపోయారు. పాకిస్థాన్ బౌలర్ల ముందు చేతులెత్తేశారు. కేవలం 37 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసి ఓటమిని కౌగలించుకున్నారు. పాక్ బౌలర్ నవీద్ ఉల్ హసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.
ప్రేక్షకులు మైదానంలోకి బాటిల్స్ విసరడంతో 16 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఒక ప్లాస్టిక్ బాటిల్ తాకి భారత బ్యాట్స్మన్ మహమ్మద్ కైఫ్ స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో ఇరు జట్లు డ్రెసింగ్ రూమ్కు వెళ్లిపోయాయి. భద్రతా జవాన్లు, ఢిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధికారులు రంగంలోకి దిగి ప్రేక్షకులను శాంతింపజేశారు.
టాస్ ఓడిన ద్రావిడ్ ఫీల్డింగ్కు దిగాల్సి వచ్చింది. షాహిద్ ఆఫ్రిదీ మరోసారి రెచ్చిపోయి నెహ్రా వేసిన రెండో ఓవర్లో 22 పరుగులు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ 21 పరుగులకే పెవిలియన్ దారి పట్టడంతో భారత్ కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ సచిన్ టెండూల్కర్ 9 పరుగులకే అవుటయ్యాడు. ద్రావిడ్ రన్నవుట్ కావడంతో మ్యాచ్పై భారత్ ఆశలు పూర్తిగా నీరుగారాయి. మహేంద్ర సింగ్ ధోని 24 పరుగులు, యువరాజ్ సింగ్ 13, కైఫ్ 13 పరుగులు చేశారు. అంతకు ముందు పాకిస్థాన్ బ్యాట్స్మన్ 68 పరుగులు, షోయబ్ మాలిక్ 72 పరుగులు చేశారు. ఆఫ్రిదీ అతి వేగంగా 44 పరుగులు చేసి మంచి ప్రారంభాన్ని అందించాడు.