ఉగ్రవాద నియంత్రణకు ఇరువురి కృషి: మన్మోహన్
న్యూఢిల్లీ: శాంతి ప్రక్రియను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి భారత్, పాక్లు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. సానుకూల కదలికను, సానుకూల సంబంధాలను ఖాయం చేయాల్సిన బాధ్యత ఉభయ దేశాలపై ఉన్నదని మన్మోహన్ సింగ్ ముషార్రఫ్తో చర్చల సందర్భంగా అభిప్రాయపడినట్లు విదేశాంగ కార్యదర్శి శ్యాం శరన్ విలేరులతో చెప్పారు.
శ్రీనగర్ - ముజఫరాబాద్ బస్సు సర్వీసుపై ఉగ్రవాదుల దాడి వంటి సంఘటనలు శాంతి ప్రక్రియను దెబ్బ తీసే ప్రమాదం ఉంటుందని, ఇటువంటి కార్యకలాపాలను నియంత్రించి ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని అన్నారు.
సరిహద్దులను తిరిగి మార్చడం సాధ్యం కాదని, అయితే భారత్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను కలపాలనే లక్ష్యానికి భారత్ అనుకూలంగా ఉన్నదని మన్మోహన్ సింగ్ ముషార్రఫ్తో చెప్పారు. భారత్, పాక్ల మధ్య రవాణా సౌకర్యాలు మరింతగా పెరగాలని, ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంచాలని మన్మోహన్ సింగ్ అన్నారు.