తోటపల్లిపై కొనసాగుతున్న నిరసన: రేపు బంద్
విజయనగరం: తోటపల్లి రిజర్వాయర్ ఘటనపై ఆదివారం నిరసన కొనసాగింది. విజయనగరం, బొబ్బిలిలలో రాస్తారోకో నిర్వహించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాత ప్రాజెక్టు పనులు చేపట్టాలని వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసుల చేత ప్రాజెక్టు పనులు చేయించడం వెనక కుట్ర వున్నదని వారు విమర్శించారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్వాసితులపై శనివారం పోలీసులు కాల్పులు జరిపారు, లాఠీచార్జి చేశారు. ఈ ఘటనకు నిరసనగా సిపియం సోమవారం పార్వతీపురం బంద్కు పిలుపునిచ్చింది.
శనివారంనాటి ఘటన బాధితులకు రెండు లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని సిపియం రాజ్యసభ సభ్యుడు మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యను పరిష్కరించిన తర్వాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఆయన కోరారు. ఆ తర్వాత పనులు వేగవంతం చేయడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ను మధు కలిశారు.