తెలంగాణపై కాంగ్రెస్ మంత్రులు తీరు ఇదేనా?: విహెచ్
మెదక్: తెలంగాణపై కాంగ్రెస్ మంత్రులే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు విమర్శించారు. హైదరాబాద్ను చండీఘడ్ మాదిరిగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఒక మంత్రి అనడం, దానిపై మరో ముగ్గురు మంత్రులు ప్రకటన చేయడం సరి కాదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణపై ఏ నిర్ణయం జరగలేదని, అప్పుడే మంత్రులు ఆ విధమైన ప్రకటనలు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు.
మంత్రులుగా ఉంటూ ఆ విధమైన ప్రకటనలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని, దాన్ని చూస్తూ ఊరుకున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రకటన చేసే హక్కు తమ నాయకురాలు సోనియా గాంధీకి మాత్రమే ఉన్నదని ఆయన అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కేశవరావు ఇష్టమైన రీతిలో ప్రకటనలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. ప్రకటనలు చేయడానికి ఆయనొక్కడే నాయకుడా అని హనుమంతరావు అడిగారు. తెలంగాణపై కేశవరావు మొదట ఏమన్నారని, ఇప్పుడు ఏ మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.