తృతీయ ఫ్రంట్లో టిడిపి ఉంటుంది: ఎస్పి ఆశ
న్యూఢిల్లీ: తాము ఏర్పాటు చేయబోయే తృతీయ ఫ్రంట్లో తెలుగుదేశం ఉండగలదని సమాజ్వాదీ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ తృతీయ ఫ్రంట్లో డియంకె. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఉండగలవని కూడా లోక్సభలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ విప్, పార్టీ థింక్ ట్యాంక్ మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా తలపెట్టిన తృతీయ ఫ్రంట్కు పశ్చిమ బెంగాల్, కేరళ శాసనసభల ఎన్నికల తర్వాత నిర్దిష్టమైన రూపం రాగలగదని ఆశిస్తున్నట్లు ఆయన సోమవారం విలేకరులతో చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తర్వాత ప్రతిపాదిత తృతీయ ఫ్రంట్ కొన్ని కనీస ఉమ్మడి కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధమైన ప్రత్యామ్నాయ ఏర్పాటు అవసరం విషయంలో వామపక్షాలను ఒప్పించడంలో తమ పార్టీ కీలకమైన పాత్ర పోషించిందని ఆయన చెప్పారు.
తెలుగుదేశంతో తాము సంబంధాలు కొనసాగిస్తున్నామని, త్వరలోనే ఆ పార్టీ ముందుకు రాగలదని ఆయన అన్నారు. డియంకె - కాంగ్రెస్ కూటమి చిరకాలం కొనసాగుతుందని తాము అనుకోవడం లేదని, డియంకె కూటమి నుంచి బయటకు వచ్చి తృతీయ ఫ్రంట్తో చేతులు కలపగలదని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.