సైనికీకరణతో ఫాసిస్టు పాలనకు శ్రీకారం: నక్సల్స్ నేతలు
హైదరాబాద్: భారత ప్రభుత్వం సైనికీకరణ ద్వారా ఫాసిస్టు పాలనకు శ్రీకారం చుడుతోందని సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ (యంయల్) జనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శి అమర్ విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం ద్వారా ప్రభుత్వం ఫాసిస్టు పాలనకు శ్రీకారం చుట్టిందని వారన్నారు. ఈ మేరకు వారి పేర్ల మీద విడుదలయిన ప్రకటన మీడియా కార్యాలయాలకు అందింది. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్టాండింగ్ కమిటీ వేయాలనే నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఎమర్జెన్సీని తేవడానికి ప్రయత్నిస్తోందని వారు విమర్శించారు.
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు ఆధునిక ఆయుధాలను సమకూర్చాలని, నిధులను ఇవ్వాలని ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం ద్వారా సైనికీకరణకు పాల్పడుతోందని వారన్నారు. నక్సల్స్ బూచీని చూపి ప్రభుత్వం ప్రజలను ఆణచివేసేందుకు సిద్ధపడుతోందని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు చర్చలకు సిద్ధమంటూనే మరో వైపు నక్సల్స్ అణచివేతకు 300 కోట్ల రూపాయల విలువ చేసే అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటూ నయవంచనకు పాల్పడుతోందని వారన్నారు. పోరాటాలకు సిద్ధం కావాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.