చట్టాన్ని అతిక్రమిస్తే ఎన్కౌంటర్లు తప్పవు: వైయస్
గుడివాడ/విజయవాడ: చట్టాన్ని అతిక్రమిస్తే ఎన్కౌంటర్లు తప్పవని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. బూటకపు ఎన్కౌంటర్లను సహించబోమని కూడా ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆయన ఆదివారం రాజీవ్ నగర బాటలో పాల్గొన్నారు. ఆయుధాలు పట్టుకుని తిరిగేవారిని తప్పించే అధికారం చట్టానికి ఉన్నదని ఆయన అన్నారు. ఇన్ఫార్మర్ల పేరిట నక్సలైట్లు అమాయకులను చంపడాన్ని సహించబోమని ఆయన చెప్పారు.
కృష్ణానదిపై తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు నెలల్లో ప్రారంభిస్తామని, ఈలోగా దానికి అనుమతులూ లభిస్తాయని ఆయన చెప్పారు. కృష్ణా డెల్టా పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏడాదిలోగా కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులు ప్రారంభిస్తామిన ఆయన చెప్పారు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందిస్తామని కూడా ఆయన చెప్పారు. పోలవరం కుడి కాలువ పనులకు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) నుంచి వైదొలగదని ఆయన అన్నారు. టి ఆర్యస్ తమను వీడిపోతుందనే భయం తమకు లేదని, తమతోనే ఉంటుందనే నమ్మకం ఉన్నదని ఆయన అన్నారు. టి ఆర్యస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన మాట వాస్తవమేనని, టి ఆర్యస్ ప్రభుత్వం నుంచి వైదొలుగుతుందనే వార్తలు వదంతులేనని ఆయన చెప్పారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.