తెలంగాణకు వ్యక్తిగతంగా నేను సరే: ఎమ్మెస్సార్
కరీంనగర్: వ్యక్తిగతంగా తాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖమని దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణరావు అన్నారు. అయితే తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీదే తుది నిర్ణయమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ అంశాన్ని సోనియా గాంధీ చేతిలో పెట్టామని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులుగానీ తాము గానీ నిమిత్తమాత్రులమని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్ఠానవర్గం సుముఖంగా ఉందనే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల ప్రకటనలను ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పట్లో ఏర్పడదని ఆయన అన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందనేది కాదనలేని నిజమని ఆయన అన్నారు. కావాలంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి వస్తానని, గాంధీ మార్గంలో సాగుదామని, దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయని, అందుకు పోరాడాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.