రవి హత్య కేసులో చార్జిషీట్: ప్రధాన నిందితుడు సూరి
అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబి ఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. 130 మందిని విచారించిన సిబి ఐ 50 పేజీల చార్జిషీట్ను దాఖలు చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరిని చేర్చింది. మరో 12 మందిని సహాయకులుగా పేర్కొంది. సిబి ఐ చార్జిషీట్లో పేర్కొన్న 13 మంది నిందితుల్లో జూలకంటి శ్రీనివాస్ రెడ్డి మినహా మిగతా 12 మంది జైలులోనే ఉన్నారు.
రాయలసీమ ఐజి ఆర్.పి. మీనాకు సిబిఐ క్లీన్చిట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్. జగన్మోహన్ రెడ్డిని, మంత్రి జె.సి. దివాకర్ రెడ్డిని, మద్దెలచెర్వు సూరి భార్య భానుమతిని మళ్లీ విచారించాల్సిన అవసరం ఉన్నదని సిబి ఐ చార్జిషీట్లో పేర్కొంది. విప్లవ దేశభక్త పులుల ( ఆర్పీటి) నాయకుడు పటోళ్ల గోవర్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు రామస్వామి, ఆనందకుమార్ రెడ్డిల ప్రస్తావన చార్జిషీట్లో లేదు. పరిటాల హత్యకు నిందితులు ఉపయోగించిన ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఒక్కటేనని సిబి ఐ నిర్ధారణకు వచ్చింది. పరిటాల హత్య జరిగిన 89 రోజులకు సిబి ఐ చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో పేర్లు లేకపోవడంతో పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని, రామస్వామిని హైదరాబాద్లోని చంచల్గుడా జైలుకు తరలించారు.
మద్దెల చెర్వు సూరిపై ఉన్న పెండింగ్ కేసుల విచారణను కోర్టు మే 12వ తేదీకి వాయిదా వేసింది.