లాలూ దాణా స్కామ్పై అల్లరి: పార్లమెంటు వాయిదా
న్యూఢిల్లీ: దాణా కుంభకోణం కేసులో చార్జిషీట్ దాఖలైనందున రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యులు పట్టుబట్టడంతో పార్లమెంటు ఉభయసభల కార్యక్రమాలు స్తంభించాయి. ఉభయ సభలు కార్యక్రమాలేవీ చేపట్టకుండానే రేపటికి వాయిదా పడ్డాయి. బిజెపి సభ్యులకు, లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతుదారులకు మధ్య ఉభయ సభల్లోనూ వాగ్వివాదం చెలరేగింది.
లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేయాలని పట్టుబడుతూ బిజెపి సభ్యులు లోక్సభలో వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ సోమనాథ్ ఛటర్జీని సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
కేంద్ర మంత్రివర్గం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ను డిస్మిస్ చేయాలని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి డిమాండ్ చేశారు. గుజరాత్లో దాడికి సంబంధించి లాలూ బిజెపిపై, సంఘ్పరివార్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సంఘ్ పరివార్పై లాలూ పార్లమెంటులో చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన కోరారు.