మంత్రి దౌత్యంతో రీకౌన్సెలింగ్ ప్రారంభం
విజయవాడ: మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ సీట్ల భర్తీకి ఉద్దేశించిన రీకౌన్సిలింగ్ అల్లర్ల కారణంగా ఆగిపోయింది. మెడికల్ పిజి కోర్సుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ రీకౌన్సెలింగ్ చేయాల్సి వచ్చింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ బిసి, ఎస్సి, ఎస్టి విద్యార్థులు ఆందోళనకు దిగారు. రీకౌన్సెలింగ్లో తమకు అన్యాయం జరుగుతోందని బిసి, ఎస్సి, ఎస్టి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
రీకౌన్సెలింగ్ జరుగుతున్న హాల్లోకి దూసుకెళ్లి విద్యార్థులు విధ్వంసానికి దిగారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఉద్యోగులపై ఎస్సి, ఎస్టి చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. విధులను అడ్డుకున్న ఆందోళనకారులపై చర్య తీసుకోవాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రీకౌన్సెలింగ్కు వచ్చిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకారులు బయటకు పంపారు. కాగా, టాపర్ గుడిపాటి అనంతరామ్కు కోరుకున్న సీటు లభించింది.
రీకౌన్సెలింగ్పై ఆందోళనకారులు వ్యక్తం చేసిన సందేహాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి జవాబు వచ్చే వరకు రీకౌన్సెలింగ్ను ఆపేయాలని వారు నిర్ణయించుకున్నారు. హెల్త్ యూనివర్శిటీ అధికారుల నుంచి సమాచారం అందగానే దౌత్యం నెరపాల్సిందిగా ప్రభుత్వం మంత్రి కోనేరు రంగారావును ఆదేశించింది. దీంతో ఆయన విద్యార్థులతోనూ హెల్త్ యూనివర్శిటీ అధికారులతోనూ సమావేశమయ్యారు. మంత్రి ఇచ్చిన హామీతో విద్యార్థులు సంతృప్తి చెందారు. దీంతో రీకౌన్సెలింగ్ తిరిగి ప్రారంభమైంది.