కాంగ్రెస్తో సంకీర్ణంలో కొనసాగుతాం: కెసిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్తోనే ఉంటామని, కాంగ్రెస్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతామని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) అధినేత, కేంద్ర కార్మిక మంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త్వరలోనే జరుగుతుందని ఆయన అన్నారు. పార్టీ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఏర్పాటయిన ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
తెలంగాణకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సానుకూలంగా వున్నారని, ఈ విషయాన్ని ఆమె నరేంద్ర, ఇతర టి ఆర్యస్ మంత్రుల సమక్షంలో చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు చేపట్టిన తర్వాత ఏ విధమైన అడ్డంకులు ఎదురు కాకూడదనేది సోనియా ఉద్దేశమని, ఆ అడ్డంకులను ఇప్పుడే తొలగించే ప్రయత్నంలో ఉన్నారని ఆయన అన్నారు. కొన్ని పత్రికలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తాము వ్యతిరేకమని సిపియం అంటూనే ఉన్నదని, అరిగిపోయిన రికార్డుల ఆ మాట పదే పదే చెబుతోందని, ఆ విషయం కారత్ వద్దకు వెళ్లే ముందు కూడా తనకు తెలుసునని, అయితే భారతదేశంలోని కమ్యూనిస్టు ఉద్యమాన్ని సమన్వయం చేయడానికి సిపియం ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ కారత్ ఎన్నికయ్యారని, అందువల్ల మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రకాశ్ కారత్కు చెప్పడం ధర్మంగా భావించానని ఆయన అన్నారు.
హైదరాబాద్ ఆంధ్రుల సొత్తు కాదని టి ఆర్యస్ నేత ఎ. నరేంద్ర అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ఆయన అన్నారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే కొందరి వాదనలను ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.