హైదరాబాద్ సమీపంలో నక్సల్ దంపతుల ఎన్కౌంటర్
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు దంపతులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ వనస్థలిపురం సమీపంలో నాగార్జునసాగర్ రోడ్డుపై గల హస్తినాపురంలో బుధవారం సాయంత్రం నాలుగు, నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగింది.
తమకు అందిన సమాచారం మేరకు హైదరాబాద్ స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చేపట్టారని, ఈ సమయంలో ఒక ఇంటిలో ఉన్న నక్సలైట్లు పోలీసులపై కాల్పులు జరిపారని, ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని, ఇందులో ఇద్దరు నక్సలైట్లు మరణించారని, వారు భార్యాభర్తలని ఎల్.బి. నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సంఘటనా స్థలం నుంచి రివాల్వర్, విప్లవసాహిత్యం, ఫొటో ఆల్బమ్, శిక్షణాశిబిరం సామగ్రి, ఇతర మారణాయుధాలు లభ్యమైనట్లు ఆయన తెలిపారు. మృతులను ఇంకా గుర్తించలేదు. నక్సల్స్ దంపతులు ఆశ్రయం పొందిన ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వారు హైదరాబాద్ ఎందుకు వచ్చారనే విషయం తెలియడం లేదు.