కరుణాకరన్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ - ఇందిర
త్రిషూర్: కేరళలోని కాంగ్రెస్ పార్టీని చీల్చి అసమ్మతి కాంగ్రెస్ నేత కె. కరుణాకరన్ ఆదివారంనాడు కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తన పార్టీకి నేషనల్ కాంగ్రెస్ - ఇందిరగా పేరు పెట్టారు. కె. మురళీధరన్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని కరుణాకరన్ ఆదివారం పార్టీ కార్యకర్తల సదస్సులో ప్రకటించారు. మూడు రంగుల జెండాపై చర్కా, ఇందిర చిత్రపటాలుంటాయి.
పార్టీని ప్రక్షాళన చేయడమే తన ప్రధానోద్దేశమని ఆయన సదస్సుకు ముందు మీడియా ప్రతినిధులతో అన్నారు. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకత్వంపై ఆయన తీవ్రంగా ధ్వసమెత్తారు. అయితే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ( ఎ ఐసిసి) అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆయన విమర్శలు చేయలేదు. ఈ విషయంలో ఆయన సంయమనం పాటించారు. సదస్సులో రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ప్రతిపాదించిన తర్వాత తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఆదర్శాలతో, జాతీయ కాంగ్రెస్ నాయకుల స్ఫూర్తితో తమ కొత్త పార్టీ ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్తో తన పయనాన్ని ఆయన సదస్సులో గుర్తు చేసుకున్నారు.