ఇండో పాక్ శాంతి యాత్రకు పాక్ బ్రేక్లు
హైదరాబాద్: ఇండో పాక్ శాంతి యాత్రకు పాకిస్థాన్ బ్రేక్లు వేసింది. ఇండో పాక్ శాంతి యాత్రను ఢిల్లీ నుంచి ముల్తాన్ వరకు తలపెట్టినట్లు, ఈ యాత్ర మార్చి 23వ తేదీన ఢిల్లీలో ప్రారంభమైందని హార్మొనీ కాన్సెప్ట్ ట్రస్టీ బి. రామకృష్ణం రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీన ముల్తాన్లో ఈ యాత్రను ముగించాల్సి ఉన్నదని, అయితే పాకిస్థాన్ దౌత్యవేత్తలు తమకు వీసాలు నిరాకరించిందని ఆయన చెప్పారు. ఈ యాత్ర వాఘా సరిహద్దుల వరకు సాగిందని, తాము అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసినప్పటికీ పాకిస్థాన్ వీసాలు ఇవ్వడం లేదని, దీంతో యాత్ర ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు.
పాకిస్థానీలకు మన ప్రభుత్వం వీసాలు ఇచ్చిన్పటికీ పాక్ తమకు వీసాలు నిరాకరించడం సరైంది కాదని, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి తలపెట్టిన ఇటువంటి యాత్రకు అడ్డంకులు సరి కాదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బి. రామకృష్ణంరాజు, గజల్ శ్రీనివాస్ ఈ శాంతి యాత్రలో పాల్గొంటున్నారు.