ఆర్టీసిని ప్రైవేట్పరం చేయం: వైయస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టిసి)ని ప్రైవేట్పరం చేయబోమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఆర్టీసి గుత్తాధిపత్యం మాత్రం కుదరదని, ప్రైవేట్ సంస్థలతో ఆర్టీసి పోటీ పడాలని ఆయన అన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన మేడే ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. ఆడపిల్లల పెళ్లికి కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ఐదేసి వేల రూపాయలు ఇప్పిస్తామని ఆయన చెప్పారు. పది వేల మంది బీడి కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని కూడా ఆయన చెప్పారు.
ప్రపంచీకరణ, సరళీకరణ కార్మికులకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. పోటీ తత్వాన్ని ఎదుర్కోవడానికి అందరూ కలిసి పని చేయాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని ఆయన చెప్పుకున్నారు. తమ ప్రభుత్వం కార్మికశక్తిని గుర్తిస్తుందని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో 858 పారిశ్రామిక వివాదాలను పరిష్కరించుకున్నామని ఆయన చెప్పారు.