తెలంగాణ బిల్లు పెడితే గంటలోగా నిర్ణయం: బిజెపి
హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రతిపాదిస్తే గంటలోగా తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) యాచకవృత్తి మానుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామి, టి ఆర్యస్ నాయకుడు ఎ. నరేంద్ర చేసిన వ్యాఖ్యలు తెలంగాణకు అవమానకరమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేయలేనప్పుడు ఉపసంఘం బోగస్ కాకపోతే ఏమిటని ఆయన అడిగారు. వామపక్షాలు సిపి ఐ, సిపియం సైద్ధాంతికంగా రాజీపడుతున్నాయని, అధికారం కోసం సైద్ధాంతికంగా రాజీ పడి కాంగ్రెస్తో కలిసి పని చేస్తున్నాయని, అటువంటప్పుడు తెలంగాణ వంటి విధానపరమైన అంశం విషయంలో రాజీ పడకపోవడం సరి కాదని ఆయన అన్నారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వామపక్షాలు వ్యతిరేకించలేదని, నిరసన మాత్రమే తెలియజేశాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో వ్యతిరేకించాల్సిన అవసరం ఏమిటని ఆయన అడిగారు. తెలంగాణ ఏర్పాటుకు సిపియం అంగీకరించదని వెంకటస్వామి అనడాన్ని గుర్తు చేస్తూ ఎన్నికలకు ముందు ఆ విషయం తెలియదా అని దత్తాత్రేయ అడిగారు.