సామాన్యులకు సేవలు చేస్తా, ఊళ్లో ఉంటా: గోపన్న
రాజమండ్రి: తాను ఒక ఉపయోగకరమైన పనులు చేస్తానని, సామాన్యులకు సేవ చేయడానికి కాలం వెచ్చిస్తానని పోలీసులకు చిక్కిన ఒరిస్సా, ఆంధ్రా సరిహద్దు దళ కమిటీ నేత శేషగిరిరావు అలియాస్ గోపన్న చెప్పారు. తన గ్రామానికి ఇక నుంచి సేవలు అందిస్తానని ఆయన మంగళవారంనాడు మీడియా ప్రతినిధులతో అన్నారు. సి ఆర్పియఫ్ జవాన్లు మరణించిన మారేడుమిల్లి దాడి కేసులో ఆయనకు బెయిల్ లభించింది. ఆయనపై ఆరు కేసులున్నాయి. ఇంతకు ముందే ఐదు కేసుల్లో రాజమండ్రి 3వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజారు చేయడంతో ఆయన విడుదలకు మార్గం ఏర్పడింది.
సుదీర్ఘ సాయుధ పోరాటం చేయడానికి తనకు మానసిక స్థయిర్యం ఉందని, అయితే సుదీర్ఘ జైలు జీవితం గడపడానికి అవసరమైన మానసిక ధైర్యం లేదని ఆయన అన్నారు. అయితే తాను విప్లవోద్యమ, ప్రజా వ్యతిరేక కార్యకపాలకు దిగబోనని చెప్పుకున్నారు. ఎక్కడైనా విభేదాలు సహజమని, విభేదాల వల్ల తాను విప్లవోద్యమం నుంచి బయటకు రావడం లేదని ఆయన అన్నారు. తాను పెద్ద యెత్తున నిధులు దండుకున్నాననే ఆరోపణల్లో నిజం లేదని, పార్టీకి, పోలీసులకు అసలు విషయం తెలుసునని ఆయన అన్నారు. తన అరెస్టుపై పార్టీ సానుభూతి చూపలేదనే ఉద్దేశంతోనే సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఒక ఎన్కౌంటర్లో తనకు సంబంధించిన ఉత్తరం పోలీసుల చేతికి చిక్కిందని, దాంతో తన కార్యక్రమాలన్ని వారికి తెలిసిపోయాయని, ఆ కారణంగా తాను పోలీసుల చేతికి చిక్కానని ఆయన చెప్పారు. పార్టీ అప్పగించిన పని చేయాలనే అత్యుత్సాహంలో తాను పోలీసులకు దొరికి పోయినట్లు ఆయన చెప్పుకున్నారు.