ఎవరి గుట్టు ఏమిటో తేల్చుకుందాం, రా!: కెసిఆర్
హైదరాబాద్: అర్జంటుగా గుట్టు విప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) అధినేత, కేంద్ర కార్మిక మంత్రి కె. చంద్రశేఖర్ రావు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామికి సవాల్ విసిరారు. మరోసారి తనపై నోరు విప్పితే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల బండారం బయటపెడతానని వెంకటస్వామి అన్న విషయం తెలిసిందే. వెంకటస్వామి వ్యాఖ్యలను చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన మంగళవారంనాడు సినీ ప్రముఖలకు చెందిన చిత్రపురి కాలనీ స్థలాన్ని సందర్శించారు. తెలంగాణ ఏర్పడితే సినిమా రంగానికి ఏ విధమైన నష్టం జరగదని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సినీ రంగానికి మరింత మెరుగైన పరిస్థితులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణపై వెంకటస్వామి వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన అన్నారు. అటువంటి వ్యాఖ్యలు పెద్దరికాన్ని తెచ్చిపెట్టవని ఆయన వెంకటస్వామిని ఉద్దేశించి అన్నారు. ఎవరి గుట్టు ఏమిటో తేల్చుకుందామని ఆయన వెంకటస్వామికి సవాల్ విసిరారు. తెలంగాణ పెద్దమనిషిగా వెంకటస్వామిని గౌరవిస్తామని, అయితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చేతులు ముడుచుకుని కూర్చోబోమని ఆయన అన్నారు. వెంకటస్వామి పార్ట్టైమ్ తెలంగాణ వాది అని, తాము ఫుల్టైమ్ తెలంగాణవాదులమని ఆయన అన్నారు. తెలంగాణపై విషప్రచారం చేయడం వెంకటస్వామికి తగదని ఆయన అన్నారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 29 పార్టీల మద్దతు ఉన్నదని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చిత్ర పరిశ్రమకు నష్టమేమీ లేదని సినీ కార్మికు సమాఖ్య అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఎక్కడ అవకాశాలు మెరుగ్గా ఉంటే అక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయినప్పుడు మద్రాసులో సినిమాల నిర్మాణం ఆగిపోలేదని ఆయన గుర్తు చేశారు.