కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని తేలింది: విజయశాంతి
చెన్నై: సీనియర్ నేత జి. వెంకటస్వామి ప్రకటనతో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వదని తేలిపోయిందని ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టులు వారెందుకు కలిసి ఉండరో ప్రజలకు తెలియజేయాలని ఆమె ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిమాండ్ చేశారు.
వడగళ్లవాన వంటి ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన తెలంగాణ రైతులను ఆదుకోవాలని ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని డిమాండ్ చేశారు. పిడుగుపాట్లకు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు మరణించినవారి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండ, రంగారెడ్డి, తదితర తెలంగాణ జిల్లాల్లో రాళ్లవర్షం బీభత్సం సృష్టించిందని ఆమె అన్నారు. పిడుగులు పడి కొంత మంది చనిపోయారని ఆమె చెప్పారు. ఆస్తులను, ఆప్తులను కోల్పోయిన తెలంగాణ రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. కరెంట్ స్తంభాలు కూలిపోయి కరెంట్ లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె చెప్పారు. గుండె నిబ్బరంతో వ్యవహరించాలని ఆమె తెలంగాణ రైతులను కోరారు.