నక్సల్స్పై నిషేధానికి పోలీసు సంఘం విజ్ఞప్తి
ఒంగోలు: మావోయిస్టులపై, మావోయిస్టు అనుబంధ సంఘాలపై నిషేధం విధించి, పిడి యాక్ట్ తరహా చట్టం తెచ్చి అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వి. అనంతరాములు ప్రభుత్వాన్ని కోరారు. ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) మహేష్ చంద్ర లడ్హాపై నక్సలైట్లు దాడి చేయడాన్ని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో ఖండించారు. మావోయిస్టులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు.
నక్సల్స్ నిరాయుధులను చంపడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. గంధంచెక్కల స్మగ్లర్ వీరప్పన్ తరహాలో మావోయిస్టులు దాడులు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సామాన్యులను చంపినప్పుడు విప్లవ రచయితల సంఘం (విరసం), పౌర హక్కుల సంఘం నాయకులు నోరు విప్పకపోవడం తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. విప్లవ రచయితలు వరవరరావు, కాళ్యాణరావు, గద్దర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. ఏమైనా అంటే ప్రతిహింస, రాజ్యహింస అంటున్నారని, రాజ్య హింస అంటే అర్థమేమిటో వారు చెప్పగలరా అని ఆయన అన్నారు.
ఆయుధాలు వదిలేస్తే తప్ప చర్చలు సఫలం కావని, నక్సల్స్ ద్వంద్వ నీతిని అర్థం చేసుకోవాలని తాము నక్సల్స్తో ప్రభుత్వం చర్చలు ప్రారంభమైనప్పటి నుంచీ తాము చెప్తూనే ఉన్నామని ఆయన గుర్తు చేశారు. తాము అనవసరమైన విమర్శలు చేస్తున్నారని, తమవారిని చంపినప్పుడు తాము ప్రతిస్పందించడం తమ బాధ్యత అని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, మావన హక్కుల వేదిక కన్వీనర వేణుగోపాల్ను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో 150 మంది ప్రజా సంఘాల కార్యకర్తలను పోలీసులు విచారణ పేరిట అదుపులోకి తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు బోస్ విమర్శించారు. తమ తండ్రి ఆచూకీ చెప్పాలని రచయిత సజ్జా వెంకటేశ్వర్లు కూతురు సజ్జా భార్గవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రకాశం జిల్లా వేటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న భార్గవి ఈ మేరకు హోం మంత్రి కె. జానారెడ్డికి ఒక లేఖ రాసింది. వేటపాలెం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు సజ్జా వెంకటేశ్వర్లు విరసం సభ్యుడు. మే 1వ తేదీన తమ తండ్రిని డియస్పి రమ్మన్నాడని తీసికెళ్లారని, అయితే తాము ఫోన్ చేస్తే ఇక్కడ లేడని, డిజిపి గెస్ట్హౌస్లో ఉన్నాడని చెబుతున్నారని భార్గవి మీడియాకు చెబుతోంది.