పార్లమెంటు బహిష్కరణ: యన్డిఎ బాటలో టిడిపి
న్యూఢిల్లీ: పార్లమెంటు బహిష్కరణ విషయంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డి ఎ) బాటలో నడవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. కళంకిత మంత్రుల వ్యవహారంపై పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలని యన్డి ఎ నిర్ణయం తీసుకుంది. కె. ఎర్రంనాయుడు నేతృత్వంలో మంగళవారం ఉదయం జరిగిన తెలుగుదేశ పార్లమెంటరీ సమావేశం కూడా పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన సమావేశానికి 11 మంది పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. సమావేశం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో మాట్లాడి పార్లమెంటు సామవేశాలకు హాజరు కాకూడదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించుకుంది.
చార్జిషీట్ దాఖలైన రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాల బహిష్కరణను కొనసాగించాలని యన్డి ఎ నిర్ణయం తీసుకుంది. బహిష్కరణపై రోజువారీ సమీక్ష జరపాలని మాజీ ప్రధాని అటల్ బిహారీ అధ్యక్షతన జరిగిన యన్డి ఎ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయం తీసుకుంది.