నక్సలిజం నైతిక, రాజకీయ సమస్య కూడా: వైయస్
హైదరాబాద్: సమస్యల సాకుతో తీవ్రవాదులు తుపాకులు పట్టుకుని తిరిగితే ఊరుకోమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఎస్ ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఆయన మంగళవారం ప్రసంగించారు. నక్సల్స్ సమస్య సామాజిక, ఆర్థిక సమస్య మాత్రమే కాదని, నైతిక, రాజకీయ సమస్య కూడా అని ఆయన అన్నారు.
ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులను తుపాకి ద్వారా కూలదోసి రాజ్యాధికారం సంపాదించుకోవాలని తీవ్రవాదులు అనుకున్నప్పుడు అది రాజకీయ సమస్యనే అవుతుందని ఆయన అన్నారు. ప్రజాసమస్యలు ఒకేసారి పరిష్కారం కావని ఆయన అన్నారు. తీవ్రవాద సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని, అందుకే నక్సల్స్తో తాము చర్చలకు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. ప్రభుత్వం అనైతికంగా ప్రవరిస్తూ తమను అణచడానికి ప్రయత్నిస్తోందని నక్సల్స్ ప్రచారం చేస్తున్నందున ఇది నైతిక సమస్య కూడా అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి కె. జానారెడ్డి, పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ కూడా పాల్గొన్నారు.