రాస్తారోకో చేసిన కాళాకారులపై పోలీసు లాఠీ
హైదరాబాద్: తమ సభ్యుల అరెస్టుకు నిరసనగా బుధవారంనాడు హైదరాబాద్లోని ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకోకు దిగిన ప్రజా కళా మండలి కార్యకర్తలను పోలీసులు చితక బాదారు. మహిళలని కూడా చూడకుండా వారు లాఠీలు ఝళిపించారు. దాదాపు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు. శ్రీకాకుళంలో తన సంఘం సభ్యులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ ప్రజా కళా మండలి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
అరెస్టు చేసిన 8 మంది ప్రజా కళా మండలి కళాకారులను, విప్లవ రచయితలు రివేరా, పిన్నిక శ్రీనివాస్లను వెంటనే విడుదల చేయాలని విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యవర్గ సభ్యుడు వరవరరావు డిమాండ్ చేశారు. విప్లవ రచయితలపై, కళాకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆయన విమర్శించారు. హోం మంత్రి కె. జానారెడ్డి మాటలను కూడా పోలీసులు ఖాతరు చేయడం లేదని ఆయన అన్నారు.