చర్చలపై వైయస్కు చిత్తశుద్ధి లేదు: బాలగోపాల్
ఒంగోలు: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విధానాన్ని చూస్తుంటే ప్రభుత్వానికి, నక్సల్స్కు మధ్య చర్చలు జరగవనే అనిపిస్తోందని మానవ హక్కుల వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుర్రా రాములు, డాక్టర్ కె. బాలగోపాల్ అన్నారు. ముఖ్యమంత్రికి చర్చలపై చిత్తశుద్ధి లేదని వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వై.యస్. రాజశేఖర్ రెడ్డికి రక్తపాతం కొత్త కాదని, రక్తపాతాన్ని రాజకీయాల్లో సహజంగా భావించే నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని వారు వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ పద్ధతి సరి కాదని, నాగగరికంగా, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించి హింస, ప్రతిహింసల పర్వానికి తెర దించాల్సిన అవసరం ఉన్నదని వారన్నారు.
పోలీసులు, నక్సలైట్లు కాల్పుల విరమణను పాటించి చర్చలకు మార్గం వేయాలని వారు సూచించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ మహేష్చంద్ర లడ్హాపై జరిగిన దాడిని సాకుగా తీసుకొని పోలీసులు అన్ని హక్కుల సంఘాల నాయకులను అరెస్టు చేసి నిర్బంధిస్తున్నారని వారు విమర్శించారు. చట్ట వ్యతిరేకంగా రోజుల తరబడి నిర్బంధించి ప్రజా సంఘాల కార్యకర్తలను పోలీసులు హింసిస్తున్నారని వారన్నారు.