అనంతలో 13 మంది మావోయిస్టుల లొంగుబాటు
అనంతపురం: అనంతపురం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) ప్రవీణ్కుమార్ ముందు 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఒక మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఈ నక్సలైట్లలో ప్లాటూన్ దళ సభ్యులు, డిప్యూటీ దళ కమాండర్లు ఉన్నారు. మైనర్ బాలబాలికలను నక్సలైట్లు దళాల్లోకి రిక్రూట్ చేసుకుంటూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ప్రవీణ్కుమార్ ఈ సందర్భంగా విలేకరులతో అన్నారు. ఈ విషయమై తాము జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.
ఇదిలా వుంటే, ఇటీవల తెలుగుదేశం పెనుకొండ అభ్యర్థి పరిటాల సునీత నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తొమ్మిది మంది తెలుగుదేశం కార్యకర్తలను మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. వారికి 14 రోజుల జ్యుడిష్యల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అరెస్టయినవారిలో మాజీ నక్సలైట్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాదాపు శంకర్ ఉన్నాడు. పోలీసులు తమను చిత్రహింసలు పెట్టారని నిందితులు ఆరోపించారు.