ఎన్నికల సంఘం ఆదేశంతో సూరి జైలు మార్పు
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో కుట్రదారుడని ఆరోపణలు ఎదుర్కుంటున్న మద్దెలచెర్వు సూర్యానారాయణ రెడ్డి అలియాస్ సూరిని అనంతపురం జైలు నుంచి మార్చాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పెనుకొండ శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సూరిని విశాఖటప్నం కేంద్ర కారాగారానికి తరలిస్తూ జైళ్ల శాఖ డిజిపి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నారాయణరావు శుక్రవారంనాడు అనంతపురంలో జిల్లా కలెక్టర్, పెనుకొండ ఆర్డీవో, ఎన్నికల పరిశీలకులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు. సూరిని అనంతపురం జైలు నుంచి వేరే ప్రాంతంలోని జైలుకు తరలించాలని తెలుగుదేశం పార్టీ కోరుతూ వస్తోంది. సూరి భద్రతపై పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని పోలీసు ఉన్నతాధికారులు అనంతపురం కోర్టుకు తెలియజేశారు.
ఇదిలా వుంటే, పరిటాల రవి హత్య కేసులో సూరితో పాటు ఇతర నిందితుల రిమాండ్ను వచ్చే 3వ తేదీ వరకు పొడగిస్తూ అనంతపురం కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు.