రైతు హామీలకు కట్టుబడి ఉన్నాం: వైయస్
శ్రీకాకుళం/విజయనగరం: రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులకు కొత్త రుణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని నైరాలో ఆయన శుక్రవారం రైతు సదస్సును ప్రారంభించారు. 259 మంది రైతులకు రుణాలు, కొత్త పరికరాలు అందజేశారు. ఆయన శుక్రవారంనాడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆయన పర్యటించారు.
ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని ఆయన చెప్పారు. యేటా 50 లక్షల మంది రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని, తత్కాల్ కింద మరో లక్ష మంది కనెక్షన్లు ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో లక్ష హెక్టార్లకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. రైతు రుణ పరిమితిని పెంచుతామని ఆయన చెప్పారు. వ్యవసాయ సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయం గిట్టుబాటు కాదని గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారని ఆయన తప్పు పట్టారు.