బీహార్ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
న్యూఢిల్లీ: బీహార్ శాసనసభ రద్దుకు రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఆమోదముద్ర వేశారు. బీహార్ శాసనసభ రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత నిర్ణయం తీసుకుంది. రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జనశక్తి చీలికి దిశగా పయనిస్తూ, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డి ఎ) ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలను మెరుగుపరుచుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఏ పార్టీ కూడా స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొనడంతో శాసనసభను రద్దు చేయాలని కేంద్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఇక ఎన్నికల కమీషన్దేనని కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ అన్నారు. బేరసారాలను అడ్డుకోవడానికే శాసనసభను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అందిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటామని ఎన్నికల కమీషన్ వర్గాలంటున్నాయి. శాసనసభ రద్దు నిర్ణయాన్ని రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడి) అధినేత, రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్వాగతించారు. ఈ చర్యను భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీవ్రంగా విమర్శించింది. శాసనసభను రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బిజెపి విమర్శించింది. రేపు బీహార్ బంద్కు యన్డి ఎ పిలుపునిచ్చింది.
శాసనసభ్యుల మద్దతు సంపాదించుకోవడానికి రాజకీయ పార్టీలు రాజ్యాంగవిరుద్ధమైన, అక్రమమైన చర్యలకు పాల్పడుతున్నాయని గవర్నర్ బూటాసింగ్ కేంద్రానికి సమర్పించిన నివేదికలో తెలియజేసినట్లు పాటిల్ చెప్పారు. బీహార్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదనపు బలగాలను రాష్ట్రంలో మోహరించారు.