టిడిపికి అసాంఘిక శక్తులతో సంబంధాలు: మంత్రులు
అనంతపురం: అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అసాంఘిక శక్తులతో సంబంధాలున్నాయని రాష్ట్ర మంత్రులు జె.సి. దివాకర్ రెడ్డి, ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ సంబంధాలపై విచారణ జరిపిస్తామని వారు సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న తమ పార్టీ ఎంపిటిసి అక్కులప్పను రాజకీయ కుట్రలో భాగంగానే హత్య చేశారని వారన్నారు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి, మావోయిస్టులకు తేడా లేదని జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు.
జిల్లాలో తెలుగుదేశం, మావోయిస్టులు, ఆర్ ఓసి అనే తేడా లేదని రఘువీరారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీకి అసాంఘిక శక్తులతో సంబంధాలున్నాయని పోలీసులు, డిజిపి చెబుతున్నారని, అక్కులప్ప హత్య ఈ విషయాన్ని రుజువు చేస్తోందని దివాకర్ రెడ్డి అన్నారు. పేదలకు సాయపడాలనేది మావోయిస్టుల సిద్ధాంతమని, అక్కులప్ప పేదల పక్షాన నిలబడి పనిచేసిన వ్యక్తి అని, అటువంటి మంచి వ్యక్తి హత్య బాధాకరమని ఆయన అన్నారు. అక్కులప్ప మావోయిస్టుల టార్గెట్ అయ్యే అవకాశం ఏ మాత్రం లేదని రఘువీరా రెడ్డి అన్నారు. మావోయిస్టులను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వారే అక్కులప్పను హత్య చేసి వుంటారని ఆయన అన్నారు. అదే రాజకీయ లబ్ది కోసం చెప్పాల్సిన అవసరం లేదని, జిల్లాలో తెలుగుదేశం, ఆర్వోసి, మావోయిస్టులకు తేడా లేదని ఆయన అన్నారు.