తెలంగాణపై మాట్లాడేదేమీ లేదు: కేశవరావు
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ మాట్లాడేదేమీ లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నాయకుడు, రాష్ట్ర యువజన సర్వీసుల మంత్రి హరీష్ రావుతో కేశవరావు ఆ విషయం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమన్వయ కమిటీ (టి ఆర్సిసిసి) సమావేశం జరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావు, కేశవరావు, టి ఆర్సిసిసి చైర్మన్ జి. చిన్నారెడ్డి సోమవారం సమావేశమయ్యారు.
తమ పార్టీ ఎన్నికల ప్రణాళిక ప్రకారం తాము నడుచుకుంటామని కేశవరావు హరీష్రావుతో చెప్పారు. టి ఆర్సిసిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయాలని హరీష్రావు అడిగినట్లు కేశవరావు తెలిపారు. గాంధీభవన్లో జరిగిన టి ఆర్సిసిసి సమావేశంలో 610 జీవో అమలుపై, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావు, టి ఆర్సిసిసి నాయకుడు జి. చిన్నారెడ్డి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 610 జీవో అమలుకు తెలంగాణ నాయకులు సమావేశంలో పట్టుబట్టినట్లు సమాచారం. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి తెలంగాణ నాయకులు సూచనలు చేసినట్లు సమాచారం.