పోలీసు శాఖలో 610 జీవో అమలు షురూ: జానా
హైదరాబాద్: పోలీసు శాఖలో 610 జీవో అమలుకు శ్రీకారం చుట్టారు. పోలీసు శాఖలో 610 జీవో అమలుపై శుక్రవారం హోం మంత్రి కె. జానారెడ్డి టి ఆర్యస్కు చెందిన రాష్ట్ర యువజన సర్వీసుల మంత్రి హరీష్రావుతో, పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్తో చర్చించారు. 610 జీవో అమలును పోలీసు శాఖతోనే మొదలు పెడతామని చెప్పిన హోం మంత్రి కె. జానారెడ్డిపై టి ఆర్యస్ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో అందుకు జానారెడ్డి చర్యలకు ఉపక్రమించినట్లు చెబుతున్నారు.
610 జీవో అమలుకు చర్యలు ప్రారంభించామని, దశలవారీగా దాన్ని అమలు చేస్తామని జానా రెడ్డి విలేకరులతో చెప్పారు. తెలంగాణలో మూడు వేల మందికిపైగా కానిస్టేబుళ్లుగా, వంద మంది ఎస్ ఐలుగా స్థానికేతరులున్నారని ఆయన చెప్పారు. శాంతిభద్రలకు విఘాతం కలగకుండా 610 జీవోను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఒక హైదరాబాద్లోనే పోలీసు శాఖలో 3200 మంది స్థానికేతరులు యస్ ఐలుగా, కానిస్టేబుళ్లుగా ఉన్నారని, ఇప్పటికే 60 మందిని వారివారి స్వస్థలాలకు పంపించామని, మిగతావారిని త్వరలో పంపిస్తామని మంత్రి హరీష్రావు చెప్పారు. అన్ని శాఖల్లో 610 జీవో అమలుకు మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
మెదక్ జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై దాడి జరగడం దురదృష్టకరమని జానా రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు మంచివి కావని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడిపై దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. చంద్రబాబునాయుడిపై దాడి సంఘటనలో పోలీసుల వైఫల్యం లేదని ఆయన అన్నారు.