నక్సలైట్ల చేతిలో బాలుడితో సహా ముగ్గురు బలి
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో మావోయిస్టు నక్సలైట్లు ఒక కానిస్టేబుల్ను కాల్చి చంపారు. ఆదిలాబాద్ జిల్లాలో హోంగార్డుపై, ఆయన భార్యపై కాల్పులు జరిపి గాయపరిచారు. గుంటూరు జిల్లా ఈపురుపాలెం మండలం కొచ్చెర్లలో నక్సలైట్లు కానిస్టేబుల్ను హత్య చేశారు. జాతరలో బందోబస్తు నిర్వహిస్తుండగా మఫ్టీలో వున్న నలుగురు నక్సలైట్లు స్పెషల్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ వి. శామ్యూల్ను కాల్చి చంపారు. అతని వద్ద ఉన్న తుపాకిని, బుల్లెట్లను, మాగజీన్ను నక్సలైట్లు తీసికెళ్లారు. నక్సలైట్ల కాల్పుల్లో మరొకరు గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా తిరియాని మండలం గంభీరరావుపేటలో హోంగార్డుపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన హోంగార్డును ఆస్పత్రిలో చేర్చారు. తన భర్తపై దాడిని నిరోధించబోయిన హోంగార్డుపై కూడా నక్సలైట్లు కాల్పులు జరిపారు.
ఇదిలావుంటే, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తంబాడపడ్లలో మావోయిస్టులు నరసారెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపారు. మావోయిస్టులకు, నరసారెడ్డికి మధ్య జరిగిన పెనుగులాటలో నక్సలైట్ల తుపాకి తూటా తగిలి పదేళ్ల బాలుడు మరణించాడు. నరసారెడ్డిని మావోయిస్టులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు.
నక్సలైట్లపై గుంటూరు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ జితేందర్ తీవ్రంగా మండిపడ్డారు. నక్సలైట్లకు పిచ్చి పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక మావోయిస్టు నాయకుడు సుధాకర్ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నాడని, అతనిపై మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీలకు అదుపు లేదని ఆయన అన్నారు. సుధాకర్పై మావోయిస్టు అగ్రనాయకత్వం పట్టు కోల్పోయిందని ఆయన అన్నారు. సుధాకర్ చర్యలను ప్రజలు సహించరని ఆయన హెచ్చరించారు. సుధాకర్ అమాయకులను హత్య చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.